పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలికపై లైంగికదాడి.. ఆపై..!

నవతెలంగాణ – పెద్దపల్లి: పెద్దపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేండ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ దుర్మార్గుడు లైంగికదాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాట్నపల్లిలో ఓ రైస్ మిల్లు వద్ద చోటుచేసుకుంది. రైసు మిల్లులో గురువారం రాత్రి తల్లితోపాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బల‌రాం ఎత్తుకెళ్లాడు. అనంతరం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసి చంపేశాడు. బాలిక బతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భావించి అక్కడే గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొంత సమయానికి కుతూరు తన పక్కన కనిపించకపోవడంతో తోటి కార్మికులకు త‌ల్లి విషయం చెప్పింది. దాంతో వారందరూ కలిసి పరిసరాల్లో వెతికారు. ఈ క్రమంలో ఓ పొదల్లో విగతజీవిగా పడి ఉన్న బాలిక మృత దేహాన్ని గుర్తించారు. కాగా, గురువారం అర్ధరాత్రి బ‌ల‌రాం ఆ బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. వెంటనే స్థానికులు నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష చేయనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love