– ధరల్లో 4 శాతం తగ్గింపు
– వాణిజ్య సిలిండర్పై రూ.1.50 కోత
న్యూఢిల్లీ : సామాన్యులు వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తారా స్థాయికి చేర్చి.. జేబులకు చిల్లు పెడుతోన్న మోడి సర్కార్ ధనవంతులు ప్రయాణించే విమానయాన ఇంధన ధరలను మాత్రం వరుసగా తగ్గిస్తుంది. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరలకు తాజాగా 4 శాతం కోత పెడుతూ చమురు మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కిలోలీటర్ ఎటిఎఫ్పై రూ.4,162.5 లేదా 3.9 శాతం తగ్గించి రూ.1,01,993.17 నిర్ణయించింది. కొత్త ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.తాజా ప్రకటనతో వరుసగా మూడు నెలలోనూ తగ్గించినట్లయ్యింది. డిసెంబర్లో 6 శాతం లేదా రూ.6,854, నవంబర్లో 4.6 శాతం లేదా 5,189 చొప్పున తగ్గించింది. గతేడాది జులై ఒక్కటో తేది నుంచి ఇప్పటి వరకు దాదాపు 45 శాతం లేదా రూ.29,391 కోత పెట్టింది. ఈ తగ్గింపులు విమానయాన పరిశ్రమకు ఆర్థికంగా మద్దతును ఇవ్వనున్నాయని చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు 19 కిలోల వాణిజ్య సిలిండర్పై కేవలం రూ.1.50 తగ్గించి.. ఢిల్లీలో రూ.1,755.50గా నిర్ణయి ంచింది. కాగా.. పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను యథాతథంగా కొనసాగిం చాలని కేంద్రం భావించింది. గృహాల కోసం ఉపయోగించే గ్యాస్ ధరను కూడా ఇది వరకు స్థాయిలోనే ఉంచింది. అంతర్జాతీయ ధరల ఆధారంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్, ఇంధన ధరలను కేంద్రం సవరిస్తుంది.