అర్ధరాత్రి ప్రధాని ఇంట బీజేపీ కీలక భేటీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ:  2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది.  ప్రధాని నరేంద్ర మోడీ ఇంట బుధవారం అర్ధరాత్రి ఈ సమావేశం జరగ్గా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్‌ నేతలు కొందరు హాజరయ్యారు. ప్రధాని మోడీ ఇటీవలె అమెరికా, ఈజిప్ట్‌ పర్యటన ముగించుకుని వచ్చారు. అప్పటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలను సైతం ఉద్దేశించి ప్రసంగించారాయన. అదే సమయంలో జులై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించడం గమనార్హం. బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. అభ్యర్థుల జాబితా తయారు, బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన గురించి ప్రధానంగా చర్చించినట్లు భోగట్టా. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అందునా తాజాగా ప్రధాని గళం వినిపించిన యూనిఫామ్‌ సివిల్‌కోడ్‌ను మేనిఫెస్టోలో కొనసాగించే అంశాన్ని సైతం లేవనెత్తినట్లు ఓ బీజేపీ కీలక నేత చెబుతున్నారు. ఈ భేటీ ఆధారంగా.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వీలైనంత త్వరలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Spread the love