అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి. స్పీకర్ పోచారం

నవతెలంగాణ-నసురుల్లాబాద్ : ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా 45 మీకు సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మొదటగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ బీర్కూర్ తండా కిష్టాపూర్ చించోలి గ్రామాల్లో మండల నాయకులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పదవిలో ఉన్న నాయకులు హుందాగా ఉండాలన్నారు. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దన్నారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే తన ధ్యేయమన్నారు. సీఎం కేసీఆర్‌ మళ్లీ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయి హ్యాట్రిక్‌ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తామన్నారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే వచ్చే ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మవద్దన్నారు. స్పీకర్ పోచారంకు జనం ఆయా గ్రామాల్లో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఎంపీపీ రఘు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ సొసైటీ అధ్యక్షుడు అప్పారావు, సర్పంచ్లు రాంబాబు, పుల్లెన్ బాబురావు, అంబయ్య,కో ఆప్షన్ నెంబర్ ఆరిఫ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love