– కాంగ్రెస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం : ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్
– ఆయనతో బండి సంజయ్ భేటీ
– రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పనై పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని తరుణ్ చుగ్ నివాసంలో ఆయనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలు చర్చించినట్లు చుగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. ఆ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సాధ్యం కాని హమీలిచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. మరోవైపు బండి సంజయ్కు పలువురు నేతలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.