నవతెలంగాణ–వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ గుండాల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కరీంనగర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి “బీజేపీ గుండాలారా ఖబర్దార్” అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ గుండాలు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. కరీంనగర్ పట్టణంలో గన్లతో దొంగతనాలు జరుగుతున్నా కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులకే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ మండిపడ్డారు. అభివృద్ధిపై రాజకీయ చర్చలు జరగాలని, భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనం, క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్పై దాడి చేసేందుకు ప్రయత్నించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, వాసాల శ్రీనివాస్, కందుల క్రాంతి కుమార్, గన్నమనేని రామారావు, కొండ కనుకయ్య, నీలం శేఖర్, నీరటి మల్లేశం, అంజద్ పాషా, లైసెట్టి మల్లేశం, గుడిసె సదానందం, రేగుల రాజేశం, ఉల్లెందుల హనుమంతు, సుంకపాక రాజు, నిమ్మశెట్టి రాజు, గోసుకుల నరసయ్య, పబ్బ మహేష్, సంజీవ్, మంత సందీప్, మామిండ్ల కనకయ్య, రాధాకిషన్ రావు, పెద్ది రాజు, సయ్యద్ ఉమర్, రఫిక్, అసద్, షాహిద్, నల్ల సతీష్ రెడ్డి, మెండే రాజు, మణి తోపాటు తదితరులు పాల్గొన్నారు.



