ఓయూలో విద్యుత్‌ కొరత ఉందని నిరూపిస్తావా?

– ఆర్ట్స్‌ కాలేజ్‌ ముందు ముక్కు నేలకు రాస్తావా?: కేటీఆర్‌కు చనిగాని దయాకర్‌ సవాల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఓయూలో కరెంట్‌ కొరత ఉందని నిరూపిస్తావా? లేక ఆర్ట్స్‌ కళాశాల ముందు ముక్కు నేలకు రాస్తావా? ఏదో ఒకటి తేల్చుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్‌ మాజీ మంత్రి కేటీఆర్‌కు గురువారం ఒక ప్రకటనలో సవాల్‌ విసిరారు. అధికారులు ఇచ్చిన సెలవుల లేఖను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టిన మన్నె క్రిశాంగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్య ప్రతిష్టను దెబ్బ తీసేలా కేటీఆర్‌ కుట్ర చేశారని ఆరోపించారు. దీనిపై చర్చించేందుకు కేటీఆర్‌కు దమ్ముందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్‌ కోతలు లేనప్పుడు ఓయూలో మాత్రం ఎలా ఉంటాయో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఒక్కరోజైనా ఓయూకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైగానీ, ప్రభుత్వంపైగానీ తప్పుడు ప్రచారం చేస్తే జైలుకు పోకతప్పదని ఆయన హెచ్చరించారు.

Spread the love