ఖమ్మంలో కారు డ్యామేజ్‌..!

Car damage in Khammam..!– పొంగులేటి, తుమ్మల ఆకస్మిక ఆపరేషన్‌
– ఒక్కొక్కరిగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు
– మాజీ ఎమ్మెల్సీ బాలసానితో సహా నలుగురు కార్పొరేటర్లు, ముఖ్య నాయకుల బైబై
– పార్టీ వీడొద్దని ఆఫర్లు ప్రకటించిన కేటీఆర్‌, పల్లా.. అయినా వినని నేతలు
– రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక..
– మరికొందరు వీడకుండా మంత్రి పువ్వాడ ఆకస్మిక సమావేశం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/నకిరేకల్‌
హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీఫామ్‌లు ఇచ్చేందుకు అభ్యర్థులతో సమావేశమైన రోజే ఖమ్మంలో ‘కారు’కు భారీ డ్యామేజ్‌ జరిగింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మెన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆదివారం పొలిటికల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ కొనసాగింది. బీఆర్‌ఎస్‌ నేతలు వన్‌ బై వన్‌ అన్నట్టుగా కాంగ్రెస్‌ గూటికి చేరారు. బీఫామ్‌ తీసుకునేందుకు హైదరాబాద్‌ వెళ్లిన మంత్రి పువ్వాడ అజరుకుమార్‌కు ఈ విషయం తెలిసి ఆగమేఘాల మీద బయలుదేరి ఖమ్మం విచ్చేశారు. మరికొందరు ‘చే’జారకుండా ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈలోగానే మాజీ ఎమ్మెల్సీ, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ బాలసాని లక్ష్మీనారాయణ, బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, కార్పొరేటర్లు చావా మాధురి, రావూరి కరుణ, పోట్ల శశికళ భర్తలు చావా నారాయణరావు, రావూరి సైదుబాబు, పోట్ల వీరేందర్‌, మాజీ కార్పొరేటర్‌ చేతుల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ నేతలు సంక్రాంతి నాగేశ్వరరావు, ఏలూరి శ్రీనివాస్‌.. ఇలా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్‌లో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. పొంగులేటి క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరందరూ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. అనంతరం వీరందరినీ తోడ్కొని తుమ్మల, పొంగులేటి హైదరాబాద్‌ పయనమయ్యారు. గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ మొదటి జాబితా ప్రకటించిన రోజే ఖమ్మం ‘కారు’లో ప్రకంపనలు చోటుచేసుకోవడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపగా.. బీఆర్‌ఎస్‌కు మాత్రం ఇది మింగుడు పడని అంశమేనని విమర్శకుల మాట.
నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశంను..
అత్యధిక మెజార్టీతో గెలిపించండి:మాజీ మంత్రి తుమ్మల,మాజీ ఎంపీ పొంగులేటి
నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్‌ అధిష్టానం నకిరేకల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. నకిరేకల్‌ పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో వారు వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు చెక్‌ పెట్టాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యేను కలిసిన వారిలో నకిరేకల్‌ మాజీ సర్పంచ్‌ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.
ఆటమొదలైందన్న పొంగులేటి, తుమ్మల…అప్రమత్తమైన మంత్రి!
వన్‌ బై వన్‌ నేతలు పార్టీ వీడుతున్నారని తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అప్రమత్తమయ్యారు. ఆగమేఘాల మీద హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేశారు. అసంతృప్త నేతలు, కార్పొరేటర్లను బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్న సమయంలో మంత్రి స్థానికంగా లేకపోవడంతో ఆయన పీఏ రవికిరణ్‌ను ఓ కార్పొరేటర్‌ ఇంటికి పంపించి నచ్చజెప్పారని, మరో ముఖ్య నాయకున్ని మమత ఆస్పత్రిలోని మంత్రి ఇంటికి పిలిపించి బుజ్జగించారని సమాచారం. ఇంకా సుమారు ఏడెనిమిది కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇంకా పలువురు ‘హస్తం’ గూటికి చేరతారని, ఆట ఇప్పుడే మొదలైందని పొంగులేటి, తుమ్మల ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
కేటీఆర్‌ ఫోన్‌..  పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఇద్దరికి ఆఫర్‌..
మొదటి నుంచి మాజీ మంత్రి అనుచరునిగా ఉన్న బాలసాని లక్ష్మీనారాయణ తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పువ్వాడ అజరుకుమార్‌ మంత్రయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలసానికి కాకుండా తాతా మధుసూదన్‌కు బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇచ్చింది. అప్పటి నుంచి పార్టీలో కాస్తంత అసౌకర్యంగానే బాలసాని ఉంటున్నారు. ఈ క్రమంలో బాలసానిని భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా పార్టీ నియమించింది. ఆ తర్వాత పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన తెల్లం వెంకట్రావును తిరిగి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనకు తెలియకుండా వెంకట్రావును తిరిగి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానూ ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన నియోజకవర్గ ఇన్‌చార్జుల జాబితాలో భద్రాచలం బాధ్యతల నుంచి బాలసానిని తప్పించిఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు అప్పగించారు. ఈ పరిణామాలన్నీ బాలసానిని కలిచివేశాయి. దీనికితోడు తన రాజకీయ గురువు తుమ్మల సైతం కాంగ్రెస్‌లో చేరడంతో తాను కూడా ఆయన చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా మంత్రి పువ్వాడ రెండు పర్యాయాలు, మంత్రితో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఖమ్మంలోని బాలసాని ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. కేటీఆర్‌ ఫోన్‌ చేసి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. మరోవైపు నగర పార్టీ మాజీ అధ్యక్షులు కమర్తపు మురళికి కూడా ఆదివారం ఫోన్‌ చేసి కేటీఆర్‌ ఇదే రకమైన హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఆ సమయంలో బాలసాని, మురళి ఒకేచోట తుమ్మల, పొంగులేటితో పాటు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి సైతం కమర్తపు మురళికి ఫోన్‌ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే అవకాశం కాంగ్రెస్‌లో ఉండటంతోనే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు విలేకరుల సమావేశంలో తెలిపారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Spread the love