కాంగ్రెస్సే గెలుస్తుంది

Congress will win– రూ.4 వేల పెన్షన్‌ ఇస్తుంది
– రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌
– రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
– రైతులకు రెండు లక్ష రుణమాఫీ
– పేదల ఇంటికి నిర్మాణానికి రూ.5లక్షలు
– ఆరోగ్య శ్రీ ద్వారా ఐదు లక్షలు
– కేసీఆర్‌ రైతు వ్యతిరేకి
– ఆయన సీఎం అయ్యాక 88 వేల మంది రైతులు చనిపోయారు
– రాజధాని చుట్టు పదివేల ఎకరాలు ఆక్రమించుకున్నారు
– తన కుటుంబానికి లక్షల కోట్లు దోచి పెడుతున్నారు: రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో నెలకు రూ.4వేల పెన్షన్‌ ఇచ్చి తీరుతామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌ బాధితులకు, పైలేరియా, డయాలిసిస్‌ రోగులకు నెలకు రూ. 4 వేల పెన్షన్‌ ఇస్తామని పునరుద్ఘాటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రేవంత్‌ నివాసంలో చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లికి చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీకాంత్‌, బీజేపీ మాజీ జెడ్పీటీసీ రవీందర్‌, పలువురు మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న కేసీఆర్‌… పేదల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. దళితులకు మూడెకరాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు తదితర హామీలిచ్చినా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించని పరిస్థితి నెలకొందన్నారు. ‘వరి వేస్తే ఉరే’ అని చెప్పిన రైతు వ్యతిరేకి కేసీఆర్‌…ఆయన సీఎం అయ్యాక రాష్ట్రంలో 88వేల మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపదను కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందని విమర్శించారు. హైదరాబాద్‌ చుట్టూ పదివేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారనీ, ప్రశ్నించిన వారిపైకి పోలీసులను పంపుతున్నారని విమర్శించారు. పావలావడ్డీ, బంగారు తల్లి పథకాలను కేసీఆర్‌ సర్కారు అటకెక్కించిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయమందిస్తామన్నారు.
బీఆర్‌ఎస్‌ పాలన గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డ
విశ్వనగరం చేశానంటూ సీఎం కేసీఆర్‌ గప్పాలు కొట్టే మన హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని రేవంత్‌ ట్వీట్‌ చేశారు. మొన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్‌పేటలో ఆడ బిడ్డలపై అఘాయిత్యాల కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శిం చారు. ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలనపై ‘తిరగబడదాం-తరిమికొడదాం’ అని పేర్కొన్నారు.

Spread the love