ఉమ్మడి వరంగల్లోనే రూ.6వేల కోట్ల బకాయిలు
కార్పొరేట్లకే దోచిపెడుతున్న ప్రభుత్వం :
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) జాతీయ ఉపాధ్యక్షులు వేముల సత్యమూర్తి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పదేండ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వేల కోట్ల రూపాయల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల వ్యవస్థ నాశనమవుతోందని బిల్డర్స్ అసోసిసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) జాతీయ ఉపాధ్యక్షులు వేముల సత్యమూర్తి అన్నారు. హన్మకొండ ప్రెస్క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంట్రాక్టర్ల వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. నాగర్కర్నూల్లో ఆర్అండ్బి కాంట్రాక్టర్ ఇటీవల ఉరేసుకొని చనిపోయారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్కుమార్ రెడ్డి హయాంలో బిల్ మానిటరింగ్ సిస్టెమ్ (బిఎంఎస్) వుండేదని, కాంట్రాక్టర్లు చేసిన పనుల ఆధారంగా సీరియల్గా బిల్లులు చెల్లించేవారని అన్నారు. 2018లో బిఎంఎస్ పద్ధతిని తొలగించడంతో సమస్యలు మొదలయ్యాయన్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి రూ.2 వేల కోట్ల బిల్లులు చెల్లించినట్టు ప్రకటించారని, కానీ, అవన్నీ కార్పొరేట్ కంపెనీలకు చెల్లించారని, స్థానిక చిన్న, సన్నకారు కాంట్రాక్టర్లకు ఎవరికీ బిల్లులు చెల్లించలేదని తెలిపారు. 30 డాంబర్ ప్లాంట్లు వున్నాయని, సుమారు 3 వేల మంది ఉద్యోగులు వీటిలో పనిచేస్తుండే వారని, ఇప్పుడు ఈ సంఖ్య 1000 మందికి తగ్గిందని అన్నారు. కొత్తగా పనులు ఇవ్వడం లేదని, ఇస్తే బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయం పనులను కార్పొరేట్ కంపెనీకి అప్పగించారని, స్థానిక కాంట్రాక్టర్లకు ఇస్తే, స్థానికంగా వుండే మేస్త్రీలు, ప్లంబర్లు, పేయింటర్లకు పనులు దక్కేవన్నారు.
సీఎం, మంత్రులందరికీ తమ ఆవేదనను, గోడు వెళ్లబోసుకున్నా సమస్యలను పరిష్కరించడం లేదని, ఇప్పటికైనా తమతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 18వ తేదీన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ నిరసన కార్యక్రమంలోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
పెండింగ్ బిల్లుల కోసం 18న చలో హైదరాబాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



