తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల

Ancient Statueనవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత ఏర్పడింది. అందులో ఈ శిలను గుర్తించి బయటకు తీసినట్లు గ్రామస్థులు చెప్పారు. దీనిపై పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వగా.. గ్రామానికి చేరుకున్న అధికారులు ఆ శిలను పరిశీలించి అది చాళుక్యుల కాలంనాటిదని వెల్లడించారు. పురావస్తు శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాజాగా బయటపడ్డ ఈ శిల జైన చౌముఖి శిల్పం అని, 5 అడుగుల ఎత్తుతో చెక్కారని చెప్పారు. నలువైపులా ఉన్న శిల్పాలు 24వ జైన తీర్థంకరుడు మహా వీరుడి ధ్యానం చేస్తున్న చిత్రాలని వివరించారు. గతంలో ఈ తరహా శిల్పాలను కొలనుపాక, వేములవాడలో గుర్తించామని చెప్పారు. జైనులు వీటిని ‘సర్వతోభద్ర’ అంటూ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ శిల్పాలు లభించిన ప్రాంతాలు గతంలో జైనధర్మ కేంద్రాలుగా విరాజిల్లాయని వివరించారు. బౌద్ధుల తరహాలోనే జైనులు కూడా స్తూపాలు, చైత్యాలు నిర్మించుకునేవారని, గ్రామంలోని అంగడి వీరన్న శివాలయం ముందున్న శాసనాల ద్వారా తెలుస్తోందని శ్రీనివాస్ చెప్పారు.

Spread the love