జాబిల్లి కక్ష్యలో మరింత దిగువకు చంద్రయాన్‌-3

chandrayaan-3-further-down-in-zabilis-orbitనవతెలంగాణ – బెంగళూరు: చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-3 తాజాగా మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా దీని కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా అది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది. తదుపరి ఇలాంటి విన్యాసాన్ని ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు వీటిని చేపడతారు. ఇలా దశలవారీగా వ్యోమనౌక ఎత్తును తగ్గించి.. అంతిమంగా దాన్ని చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ నెల 23న ఈ వ్యోమనౌకను చంద్రుడిపైన దించుతారు. గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పయనమైన చంద్రయాన్‌-3.. వివిధ దశలు ముగించుకొని శనివారం రాత్రి చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

Spread the love