చంద్రయాన్-3… చివరి 17 నిమిషాలే ల్యాండింగ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయి: ఇస్రో

నవతెలంగాణ – హైదరాబాద్
చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ఘట్టం బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సాకారం కానుంది. ఈ ప్రక్రియకు 17 నిమిషాలు పట్టనుండగా, ఆ సమయాన్ని టెర్రర్ టైమ్ అని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి విజయవంతమైతే చంద్రుడి సౌత్ పోల్ పైన మొదటిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో, ల్యాండింగ్‌కు ముందు చివరి పదిహేను నిమిషాలు తమకు టెర్రిఫైయింగ్ మూమెంట్ అని ఇస్రో చీఫ్ శివన్ అన్నారు. ఈ చివరి టెర్రర్ టైమ్ ఈ మిషన్ ఫలితాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. కాగా, ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్ కదలికలను శాస్త్రవేత్తలు అనుక్షణం పరిశీలిస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో ల్యాండింగ్ అవడానికి సూర్యోదయం కోసం వేచి చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం దాదాపు గం.5.45 తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు. ల్యాండింగ్ మాడ్యూల్ సాఫ్ట్ లాండింగ్‌లో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ 17 నిమిషాల టెర్రర్ అని ఇస్రో అధికారులు అంటున్నారు. కాగా, చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆపరేషన్ 23వ తేదీ సాయంత్రం గం.5.20కి ప్రారంభమవుతుంది. ఈ లైవ్ ల్యాండింగ్‌ను ఇస్రో వెబ్ సైట్, ఇస్రో యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్, పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ డీడీ నేషనల్ టీవీలలో చూడవచ్చు.

Spread the love