బహుముఖ ప్రజ్ఞాశాలి సినారే-సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలుగు సాహిత్యానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సాహితీ యోధుడు డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారే) అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సినారే 92 వ జయంతి (జూలై 29) సందర్భంగా తెలుగు సాహిత్య పరిపుష్టికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. సినారె తన పాండిత్య ప్రతిభతో ‘జ్ఞానపీఠ అవార్డు’ను అందుకొని తెలుగు భాష వైభవాన్ని జగద్విదితం చేసారని కొనియాడారు. తెలుగు భాషా సాహిత్యంలో పద్య, గేయ కావ్యాలు, సంగీత నత్య రూపకాలు, గజళ్ళు ఇలా ప్రతి ప్రక్రియలో తన పాండిత్యాన్ని నిరూపించుకున్న విలక్షణ సాహితీవేత్త అని ప్రససించారు. కవి, సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, సినీ గేయ రచయిత, పరిపాలనాధ్యక్షుడిగా ఆయన ప్రతి రంగంలోనూ రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వం తెలంగాణ కవులు, సాహితీవేత్తలకు తగిన రీతిలో చేయూతనిస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Spread the love