నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ వాసులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. జీహెచ్ఎంసి పరిధిలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్స వానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నేటి నుంచే అర్హులైన పేదలకు ఆదజేస్తుందని కీలక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలోని గూడు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయికి కూడా పేదలకు ఖర్చు లేకుండా పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది. నేటి నుంచే హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్నదని కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది అని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడక గదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నది. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది అని కేసీఆర్ తెలిపారు.