భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన..

నవతెలంగాణ – హైదరాబాద్: కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. కోకాపేటలో మొత్తం 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో ఈ భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు బీఆర్ఎస్ కు కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేవలంలో ఐదు రోజుల్లోనే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీ భవనంలో అతి పెద్ద డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. స్టేట్‌ ఆర్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పించనున్నారు. భారత్‌ భవన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్‌ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి జాతీయ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్‌ పనులు చూసుకుంటారు. మిగతా సమయాల్లో భారత్‌ భవన్‌ నుంచే పార్టీ పనులన్నీ చక్కబెట్టనున్నట్లు సమాచారం.

Spread the love