తెలంగాణను 3 జోన్లుగా విభజించాం: సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ -హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని సీఎం అన్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో సిఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బానిస సంకెళ్లను తెంచి ప్రజాపాలనను అందిస్తున్నామని సిఎం తెలిపారు. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని వివరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నం ఆవిష్కరిస్తామన్నారు. మూసీ సుందరీకరణ పథకం ద్వారా వెయ్యి కోట్లతో పరివాహక ప్రాంతం ఉపాధికల్పన జోన్ గా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆర్థిక క్రమ శిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే అభివృద్ధిలో రాజీలేని కృషి చేస్తామని.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆడబిడ్డల ప్రభుత్వం
మహాలక్ష్మీ పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా సంకల్పం. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. విద్యార్థుల యూనిఫార్మ్స్ కుట్టే ఆర్డర్ మహిళా సంఘాలకే అప్పగించాం. గ్యాస్ బండను కేవలం రూ.500కే ఇచ్చే పథకాన్ని ప్రారంభించాం.
తెలంగాణ అంటే పోరాటం.. రాష్ట్ర చిహ్నంలో అది ప్రతిబింబించాలి
చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జై తెలంగాణ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి .. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమేనని తెలిపారు. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం అని.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలని వ్యాఖ్యానించారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు.
రైతును రాజును చేయడం మా సంకల్పం
రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం ఇది. గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం రూ.7,500 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం. ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. తరుగు విషయంలో రైతు నష్టపోకుండా చూస్తున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం.
గ్రీన్ తెలంగాణ..
స్వల్పకాలిక ఆలోచనలు కాదు… దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి.. ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం.
మూసీ సుందరీకరణ..
మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా తీర్చిదిద్దబోతున్నాం. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించాం. రీజినల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం.
డ్రగ్స్ పై ఉక్కు పాదం
తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. టీ న్యాబ్ కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్యే లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను. ఇది మన యువత భవిష్యత్ కు సంబంధించిన అంశం. అందుకే ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పించాం.

Spread the love