సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

నవతెలంగాణ హైదరాబాద్: శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ.. కౌన్సిల్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూడదన్నారు. సభ్యులు పోడియంను చుట్టిముట్టి అందోళన చేయండంతో మండలి ఛైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ చెప్పారు. కాగా శాసనసభ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలను వేసుకొని శాసన మండలికి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలు వేసుకొని రావద్దని పోలీసులు సూచించారు. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, శోభన్‌ రెడ్డి, తాతా మధు, మహమూద్‌ అలీ తదితరులు సభలోకి వెళ్లిపోయారు.

Spread the love