నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన కేరళ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ హైదరాబాదు వచ్చిన సందర్భంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడాన్ని, కేంద్ర బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కేసీఆర్ ఆహ్వానం మేరకు పాల్గొనడాన్ని రేవంత్రెడ్డి తప్పుపట్టారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపరుడని, ఆయనను కలిసి విజయన్ కూడా అవినీతిపరుడని, అందుకే కేసీఆర్ను కలిసారని నోరు పారేసుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం సంప్రదాయమన్న విషయం రేవంత్రెడ్డికి తెలియదా? అంతేకాదు, కేంద్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడే క్రమంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు వచ్చి సభలో పాల్గొని విజయన్ ఏమి మాట్లాడారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరచిపోవడం ఆశ్చర్యకరమని తమ్మినేని అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సీపీఐ(ఎం) పాత్ర ఏమిటో కూడా మరచిపోయి, బాధ్యత మరచి, తప్పుడు ఆరోపణలు చేసారు. అభివృద్ధి సూచికల్లో దేశానికే కేరళ ఆదర్శం. కరోనాను ఎదుర్కోవడంలో, ప్రజలను ఆదుకోవడంలో ఐక్యరాజ్య సమితి అభినందనలను అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం అది. విద్య, వైద్యం, అధికార వికేంద్రీకరణ, ప్రజాసంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార రంగం అభివృద్ధిలోనూ, మహిళలకు, సామాజికంగా వెనకబడిన తరగతులకు భద్రత కల్పించడంలోనూ కేరళ అగ్రస్థానంలో ఉన్నది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందున్నది. రాష్ట్రాల హక్కుల కోసం, అధికారాల కోసం కేంద్రంతో పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నది. లౌకిక విలువల పరిరక్షణ కోసం, బీజేపీ-ఆర్ఎస్ఎస్ల మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నది. ఇవి తట్టుకోలేకనే మోడీ ప్రభుత్వం కక్షతో కేరళ ముఖ్యమంత్రి విజయన్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వాస్తవాలను విస్మరించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డగోలుగా మాట్లాడిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు.