విచారణ జరపాలని ఈడీ కి ఫిర్యాదు

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న సుతిలి కొనుగోలు పేరిట జరిగిన కోట్లాది రూపాయల కుంభ కోణంపై విచారణ చేయాలని హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఇడి)కి కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలంలో సివిల్‌ సప్లై, సహకార శాఖ, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి దాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, ఇట్టి దాన్యం కొనుగోలు కేంద్రాలకు గన్నీ సంచులను ప్రభుత్వం ఆధ్వర్యంలోని సివిల్‌ సప్లై శాఖ సరపరా చేస్తుండగా, వాటిని కుట్టడానికి అవసరమైన సుతిలి దారాలు మాత్రం ఆయా కొనుగోలు కేంద్రాల వారే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రతి ఖరీఫ్‌, రబీ సీజన్లో సహకార శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొన్ని సింగిల్‌ విండో సొసైటీల్లో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం సుతిలి దారాల ఖర్చు లక్షల్లో రాస్తూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని, ముత్తారం సింగిల్‌ విండో సొసైటీలో ఏకంగా ప్రతి సీజన్లో లక్షల్లో కేవలం సుతిలి దారాల, వాటర్‌ బిల్లు, ల్యాండ్‌ రెంట్‌ పేరిట, ఆఫీస్‌ మెయింటెనెన్స్‌ ఖర్చుల కింద రాస్తున్నారంటే ప్రభుత్వ నిధులు ఏవిధంగా పక్కదారి పడుతున్నాయో అర్థమవుతుందని తెలిపారు. గత మూడు ఏండ్లుగా సుతిలి కొనుగోలు పేరిట కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్టుగా పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయని, ముత్తారం (మంథని) సహకార సంఘం నుండి సరఫరా అయిన ఎరువులను, పురుగుల మందులను ప్రయివేట్‌ వ్యాపారులకు అక్రమంగా అమ్ముకొని రైతుల పేరిట తప్పుడు బిల్లులు సఅష్టించారని, అదే విదంగా సహకార సంఘం నుండి లోను తీసుకుంటే ప్రతి ఒక్క సభ్యుని చేత శ్రీరామ్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా చేయాలని బలవంతం చేసి రూ.20 వేల నుండి రూ.50 వేల వరకు ఇన్సూరెన్స్‌లు చేశారని తెలిపారు. సదరు శ్రీరామ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో గుజ్జుల రాజిరెడ్డి భార్య, కొడుకు ఏజెంట్‌గా పని చేస్తున్నారని, తన పదవిని ఉపయోగించుకొని అక్రమంగా సంపాదన చేసిన గుజ్జుల రాజిరెడ్డిపై విదారణ జరిపించాలని కోరారు. ముత్తారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన సుతిలి, వాటర్‌ బిల్లు, ల్యాండ్‌ రెంట్‌ పేరిట, ఆఫీస్‌ మెయింటెనెన్స్‌ ఖర్చుల కొనుగోలు కుంభకోణంపై విచారణ జరిపించాలని, ఈ సీజన్లో గన్నీ సంచుల తరహాలోనే సుతిలి కూడా సివిల్‌ సప్లైశాఖ ఆధ్వర్యంలో సరఫరా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని, ఎవరూ కూడా బయట మార్కెట్లో సుతిలి కొనుగోలు చేయకుండా తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Spread the love