అందుకే ఐపీఎల్ ఫైనల్ బెంగళూరు నుంచి తరలించాంఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ అరుణ్ కుమార్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఫైనల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుందని అనుకుంటే.. టైటిల్ పోరును అహ్మదాబాద్కు మార్పు చేస్తూ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ డిమాండ్లు బీసీసీఐ ప్రోటాకాల్స్ పరిధికి అతీతంగా ఉన్నాయని బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ అరుణ్ కుమార్ ధుమాల్ స్పందించారు. కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కాంప్లిమెంటరీ పాసులు అందించటం బీసీసీఐకి ఇబ్బందిగా మారిందని దుమాల్ తెలిపారు. ‘కర్ణాటక ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మూడు కాంప్లిమెంటరీ పాసులు అందజేస్తోంది. చిన్నస్వామి స్టేడియం సీటింగ్ సామర్థ్యం 40 వేలు. ఐపీఎల్ ఫైనల్ సమయంలో ఐసీసీ బోర్డు సమావేశం సైతం బెంగళూరులోనే నిర్వహించే అవకాశం ఉంది. ఐసీసీ ప్రతినిధులు, రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులు సైతం ఐపీఎల్ ఫైనల్కు హాజరవుతారు. కర్ణాటక ప్రభుత్వం డిమాండ్లను 40 వేల సీటింగ్ కెపాసిటీలో అందుకోవటం సాధ్యం కాదు. అందుకే, ఫైనల్ కోసం పెద్ద స్టేడియం అవసరమని భావించాం. అందుకే 1.3 లక్షల సీటింగ్ సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్ను టైటిల్ పోరుకు వేదికగా ఎంచుకున్నామని’ అరుణ్ కుమార్ తెలిపారు. కర్ణాటకలో 224 మంది శాసనసభ్యులు, 75 మంది శాసనమండలి సభ్యులు, 28 మంది లోక్సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓవరాల్గా 339 మంది ప్రజాప్రతినిధులకు మూడు చొప్పున 1017 వీవీఐపీ కాంప్లిమెంటరీ పాసులు అవసరం అవుతాయి. ఐపీఎల్ ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి మార్పు చేయటంపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.



