నవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం 5గంటలకు గుంటూరు జిల్లాలోని నంబూరుకు రానున్నారు. ఇక్కడి మదర్సాలోని తాత్కాలిక హజ్ హౌస్ వద్దకు ఆయన వెళ్లనున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సాయంత్రం మదర్సాకు రావాలని భావించారు. ఈ మేరకు సాయంత్రం 5.30గంటలకు చంద్రబాబు వస్తున్నట్లు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన దృష్ట్యా చంద్రబాబు పర్యటనకు అనుమతిపై సందిగ్ధత నెలకొంది. ప్రతి ముస్లిం తన జీవితంలో కచ్చితంగా అనుసరించాల్సిన ఐదు నియమాల్లో హజ్ యాత్ర ఒకటి. ఇస్లాం ధర్మంలో ఒకసారి హజ్ వెళ్లడం తప్పనిసరి. బక్రీద్ నెలలో చేసే యాత్ర హజ్ అని, సాధారణ రోజుల్లో చేసే యాత్ర ఉమ్రా అని పిలుస్తారు. ఈ ఏడాది హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి 2,000 మందికిపైగా వెళ్తున్నారు. తొలిసారి గన్నవరం విమానాశ్రయం నుంచి ముస్లిం సోదరులు వెళ్లనున్నారు. యాత్ర చేయబోయే అందరికీ పెదకాకాని మండలంలోని నంబూరు మదర్సాలో వసతి ఏర్పాట్లు చేశారు.