11వ వార్షికోత్సవ లోగోను ఆవిష్కరించిన సమాచార శాఖ
స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్ హాజరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రజల ప్రతిష్టాత్మక పత్రిక ‘నవతెలంగాణ’ దినదిన ప్రవర్థమానంగా వర్థిల్లాలని సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ జీ ముకుందరెడ్డి ఆకాంక్షించారు. నవతెలంగాణ పత్రిక 11వ వార్షికోత్సవం జరుపుకోవడం పట్ల అయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యం, ఉద్యోగులు, సిబ్బంది కృషిని కొనియాడారు. బుధవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయంలో ‘నవతెలంగాణ’ 11వ వార్షికోత్సవ లోగోను ఆయన ఆవిష్కరించారు. పత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ పీ ప్రభాకర్, సంపాదకులు రాంపల్లి రమేష్, జనరల్ మేనేజర్లు పీ లింగారెడ్డి, కే. రఘు, పీ.నరేందర్రెడ్డి, స్పెషల్ కరస్పాండెంట్ బీ బసవపున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ కమిషనర్ మాట్లాడుతూ 11వ వార్షికోత్సవ వేడుకలు ఆగస్టు 1వ తేదీ జరగనున్న సందర్భంగా పాఠకులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పత్రికలు, మీడియా పాత్ర విస్తృతంగా పెరిగిందని గుర్తుచేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మీడియా ద్వారానే ప్రజలకు చేరతాయని చెప్పారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు సామాజిక మాథ్యమాల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ల డంలో పత్రికల పాత్ర గొప్పదన్నారు. సమాజ మార్పులో మీడియాది కీలకపాత్ర స్పష్టం చేశారు.



