రైతులకు పత్తి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాం

రైతులకు పత్తి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాం– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రైతులకు కావాల్సిన పత్తి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో ప్రత్తి సాగు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసిందన్నారు. దానికి సరిపడా ప్రత్తి విత్తనాలను ఈనెల చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో పత్తి సాగుపై మంత్రి సమీక్షించారు. 2021లో 60.53 లక్షలు ఉన్న పత్తి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ 2023లో 45.17 లక్షలకు వచ్చిందనీ, అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లో ఆ పంటకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశముందని తెలిపారు. దానికి తగ్గట్టు పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోగా, ఈసారి 120 లక్షల ప్యాకెట్లను మార్కెట్లో ఉంచాలని సూచించారు. ఇప్పటికే రెండు దఫాలుగా సంబంధిత అధికారులు, విత్తన కంపెనీలతో సమావేశం జరిపి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేంద్రప్రభుత్వం ఈసారి ప్రత్తి విత్తన ప్యాకెట్‌ గరిష్ట ధరను రూ.864గా నిర్ణయించిదనీ, ఏ ఒక్క డీలరైనా, అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన సరఫరాలో ఇబ్బందులు సృష్టించే కంపెనీలను ఉపేక్షించబోమని అన్నారు. రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యను తమ ప్రభుత్వం సహించబోదనీ, విధులపట్ల అలసత్వం వహించే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసుకుని, ఎప్పటికప్పుడు అమ్మకాలను పర్యవేక్షిస్తూ…నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.

Spread the love