ఢిల్లీలోని రామ్లీలా మైదాన్కు తరలివస్తున్న ప్రజలు
బహిరంగ సభను ప్రారంభించనున్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్వాతంత్ర పోరాటం నుంచి భారతదేశంలో నిరసనలకు వేదికగా నిలిచిన ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ మంగళవారం సరికొత్త చరిత్రను సృష్టించనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) నిర్వహిస్తున్న జన ఆక్రోశ్ ర్యాలీ దేశ ప్రజల పోరాటాలకు ఒక గొప్ప వేదిక కానుంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వేలాది మంది ప్రజలు ఢిల్లీకి తరలివస్తున్నారు. వివిధ రాష్ట్రాల కార్యక్రమాలతో ఈ ర్యాలీ ప్రారంభంకానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు అమ్రారామ్ అధ్యక్షత వహించనున్నారు. ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ సభను ప్రారంభిస్తారు.
పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, తపన్సేన్, మరియం ధావలే, విజ్జూకృష్ణన్, కేంద్ర కమిటీ సభ్యులు మహమ్మద్ యూసుఫ్ తరిగామి, విక్రమ్ సింగ్, సుదీప్ దత్తా, బీహార్ రాష్ట్ర కార్యదర్శి లల్లన్ చౌదరి, పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి సుఖ్వీందర్ సింగ్ సెఖోన్ తదితరులు ప్రసంగిస్తారు. సీనియర్ నాయకులు ప్రకాశ్కరత్, బృందాకరత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్మిక వ్యతిరేక కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవడం, ఉపాధి హామీని దెబ్బతీయడానికి తీసుకువచ్చిన ‘వీబీ జీఆర్ఏఎంజీ’ని రద్దు చేయడం, విద్యుత్, విత్తన చట్ట సవరణలను విరమిం చుకోవడం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలగడం వంటి డిమాండ్లను జన ఆక్రోశ్ ర్యాలీ ముందుకు తెస్తోంది. వంటగ్యాస్, ఇంధన ధరల పెరుగుదల, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదల, చిన్న, మధ్య తరహా వ్యాపార రంగం కుప్పకూలడం వంటి సమస్యలను కూడా ర్యాలీలో ప్రధానంగా లేవనెత్తనున్నారు.



