బిపోర్‌జాయ్‌ తుపాను…8 రాష్ట్రాలకు అలర్ట్‌

నవతెలంగాణ – హైదరాబాద్
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీరం దిశగా ముంచుకొస్తోంది. గురువారం సాయంత్రం ఈ తుపాను గుజరాత్‌లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటనుంది. అయితే తీరం దాటే సమయంలో ఈ తుపాను భారీ నష్టం కలిగించే అవకాశమున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అటు గుజరాత్‌లోని కచ్‌, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. బిపోర్‌జాయ్‌ తుపాను ప్రభావంతో గుజరాత్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతో పాటు డామన్‌డయ్యూ, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్‌లో జూన్‌ 16 నుంచి ఈ తుపాను ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జోధ్‌పుర్‌, ఉదయ్‌పుర్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Spread the love