నవతెలంగాణ-ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. దొంగతనం చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు వేలాడదీసి విచక్షణా రహితంగా కొట్టారు. అహ్మద్నగర్ జిల్లా హారేగావ్లో ఓ వ్యక్తికి చెందిన మేక, పావురాలు కనిపించకుండా పోయాయి. దీంతో తమ ఇంటికి సమీపంలో ఉండే నలుగురు దళిత యువకులపై వారికి అనుమానం కలిగింది. అనుకున్నదే తడవుగా మరికొందరితో కలిసి యువకులను వారి ఇండ్ల నుంచి ఎత్తుకొచ్చారు. కాళ్లు, చేతులను కట్టేసి.. ఓ చెట్టుకు వేలాడదీశారు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా వారి వీపులపై దాడి చేశారు. దీనినంతటినీ వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్గా మారడంతో విషయం పోలీసుల వద్దకు వెళ్లింది. బాధితుల్లో ఒకరైన షుభమ్ ఫిర్యాదుతో కేసు నమోదుతో రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని యువ్రాజ్ గలాండే, మనోజ్ బొడాకే, పప్పు, దీపక్ గైక్వాడ్, దుర్గేశ్ వైద్యా, రాజుగా గుర్తించారు. వారిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు పోలీసులు.