- నేడే కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
- నవతెలంగాణ-రాయికల్
- రాయికల్ పట్టణ రాజకీయ వాతావరణం నేడు కీలక మలుపు తిరగనుంది.మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈ రోజు ఉదయం11:00 గంటలకు పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించబడనుంది.
- పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఈ కో-ఆప్షన్ స్థానాలపై పలు వర్గాలు ఆశలు పెట్టుకుని ఉండగా,అర్హుల ఎంపికపై పార్టీల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చలు జరిగాయి.ముఖ్యంగా ఓవైపు లాబాయింగ్,మరోవైపు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే ఈ స్థానాల కోసం స్థానిక నాయకులు తమ అనుచరులతో విస్తృతంగా మంతనాలు నిర్వహించినట్లుగా సమాచారం.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకోగా, కొందరు నాయకులు ఉన్నత స్థాయి నేతల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మరోవైపు, బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం కసరత్తు చేస్తున్నాయి. అయితే కౌన్సిల్లో సంఖ్యాబలం దృష్ట్యా కూటమి మద్దతు కీలకంగా మారింది.
ఇదిలా ఉండగా,గతంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఛైర్మన్, వైస్ ఛైర్మన్తో పాటు కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడగా, నేడు తిరిగి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.ఈ మేరకు కమిషనర్ కీర్తి నాగరాజు అధికారికంగా ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో ఏర్పడిన బీఆర్ఎస్-కాంగ్రెస్-స్వతంత్ర కూటమి ప్రస్తుతం మార్పులకు లోనైంది. స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో సంఖ్యాబలం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోంది.దీంతో నేటి కో-ఆప్షన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాయికల్ మున్సిపాలిటీ భవిష్యత్ రాజకీయ సమీకరణాలను నిర్ణయించే అవకాశం ఉండడంతో పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.


