నవతెలంగాణ-హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీందర్ దుడేజాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకమైన ప్రచారం చేశారనే ఆరోపణలపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాను `రాజకీయ విధేయత’ చూపానని, అనుబంధం ఉన్నాయని ఆరోపించారని, వారణాసి లోని ఒక విద్యా సంస్థలో తాను చేసిన ప్రసంగానికి సంబంధించి తప్పుదోవ పట్టించేలా ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్ చేసి తనను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ మే 14న కేజ్రివాల్, సిసోడియా సహా ఇతర ఆప్ నేతలపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టారు. కేజ్రీవాల్ చట్టపరంగా తనను ఎదుర్కోకుండా సోషల్ మీడియాలో పద్ధతి ప్రకారం దూషించే విధంగా పోస్టులు చేశారని పేర్కొన్నారు. నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ను ప్రస్తుతం మరో ధర్మాసనం విచారిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
లిక్కర్ పాలసీ కేసు న్యాయ సమీక్షలో నిలబడలేదని, విశ్వసనీయత కోల్పోయిందని తీర్పునిస్తూ.. ఫిబ్రవరి 27న విచారణ న్యాయస్థానం కేజ్రీవాల్, సిసోడియా సహా మరో 21 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో తమ పేర్లను తొలగించాలని కోరుతూ ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను ఏప్రిల్ 20న జస్టిస్ శర్మ కొట్టి వేశారు. తాము వ్యక్తిగతంగా గాని లేదా న్యాయవాది ద్వారా గాని జడ్జి ఎదుట హాజరుకామని, `మహాత్మా గాంధీ అనుసరించిన సత్యాగ్రహ మార్గం’ లో పోరాడతామని పేర్కొంటూ వారు జస్టిస్ శర్మకు లేఖ రాశారు.



