హర్యానాలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోడీ
జింద్ (హర్యానా) : చమురు సంక్షోభం నెలకొన్నా దేశాభివృద్ధి ప్రతిష్టంభించిపోలేదని ప్రధాని మోడీ శుక్రవారం అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వంటి పరిస్థితులు 2014కు ముందు వస్తే బహుశా భారతీయ రైల్వేలు స్తంభించిపోయేవని, ఎందుకంటే ఆనాడు చాలావరకు రైళ్ళు డీజిల్పై నడిచేవని అన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12ఏండ్ల కాలంలో దాదాపు 90శాతం నెట్వర్క్ను విద్యుద్దీకరించామని చెప్పారు. హర్యానాలోని జింద్ నుంచి సోనీపట్కు తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. భారత రైల్వేల రూపం మారడంతో దేశంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయన్నారు. తాజాగా హైడ్రోజన్ రైలుతో హరిత రవాణా (గ్రీన్ మొబిలిటీ) దిశగా దేశం అతిపెద్ద ముందడుగు వేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. అనేక మాసాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ కూడా కదనరంగంగా మారిందని అన్నారు. భారత్కు రావాల్సిన పెట్రో ఉత్పత్తులు ఈ మార్గం గుండానే రావాలని అన్నారు. 2014కు ముందు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ఏం జరిగి వుండేందని మోడీ ప్రశ్నించారు. 1925లో భారతీయ రైల్వేల విద్యుద్దీకరణ ఆరంభమైందన్నారు.
కానీ 90 ఏళ్ళ తర్వాత కూడా దేశ రైల్వే నెట్వర్క్లో కేవలం 30శాతం మాత్రమే విద్యుద్దీకరించబడిందన్నారు. ఇదే లెక్కన చూస్తే మొత్తం పూర్తి కావడానికి 200ఏళ్లు పడుతుందన్నారు. కానీ గత 12ఏళ్ళలో దాదాపుగా 99శాతం రైల్వే నెట్వర్క్ విద్యుద్దీకరించబడిందన్నారు. హర్యానాలో అయితే మొత్తంగా వంద శాతం పూర్తయిందన్నారు. ప్రస్తుతమున్న ఈ పరిస్థితుల్లో మన రైళ్ళు ఎక్కడా ఆగిపోలేదన్నారు. అభివృద్ధి నిలిచిపోలేదన్నారు. ఇటీవల ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ల్లో జరిపిన పర్యటన గురించి కూడా మోడీ మాట్లాడారు. రాబోయే కాలంలో, క్రీడలకు సంబంధించిన పలు రంగాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ప్రభుత్వాలతో దీనిపై మాట్లాడానని చెప్పారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తోందని, 2036లో ఒలింపిక్స్ మన దేశంలో జరిగేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
చమురు సంక్షోభం ఉన్నా అభివృద్ధి ఆగిపోలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



