– కేసీఆర్ను విమర్శించే అర్హత పొంగులేటికి లేదు
– పోడు భూముల పేరుతో జిల్లాలో రాజకీయం
– విలేకర్ల సమావేశంలో విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో జూన్ 24 నుంచి గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా భావించి అన్ని వర్గాలకు ఆమోద యోగ్యమైన పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలలో మెరుగైన వైద్యం విద్య అందించినందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది అన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలి ఇస్తామని, సర్వే పూర్తి అయింది ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి రకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సీఎం ముందుచూపుతో దేశంలో తెలంగాణ అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలని ఆశిస్తున్నట్లు అయిన తెలిపారు. జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాల పంపిణీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెంలో చేసింది పోడు యాత్ర కాదు పాడు యాత్ర అని విమర్శలు జల్లు కురిపించారు. సీఎం కేసీఆర్ విమర్శించే స్థాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. జిల్లాలో పోడు దారులకు పట్టా పాస్ బుక్కులు జిల్లా కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నరసింహారావు, టీఎస్ఎస్ చైర్మన్ కురి నాగేశ్వరరావు, పట్టణ మండల అధ్యక్షులు ముత్యం బాబు, అడప అప్పారావు, నవీన్ బాబు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.