– కేర్ బంజారాహిల్స్ సీఒఒ సయ్యద్ కమ్రాన్ హుస్సేన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హై బీఎమ్ఐ ఉన్న డయాబెటిక్ రోగుల్లో బేరియాట్రిక్ సర్జరీతో మధుమేహం దూరమవుతున్నట్ట్టు కేర్ ఆస్పత్రి (బంజారాహిల్స్) సీఒఒ సయ్యద్ కమ్రాన్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆస్పత్రిలో ఇటీవల ఒడిషా రాష్ట్రానికి చెందిన ముగ్గురు హైబీఎమ్ఐ ఉన్న రోగులు ట్రాన్స్ ఫర్మేటివ్ సర్జరీ తర్వాత డయాబెటీస్ నుంచి పూర్తిగా బయటపడ్డారని చెప్పారు. ఈ సర్జరీ తర్వాత సదరు రోగులు డయాబెటిస్ మందులు వాడాల్సిన అవసరం లేకుండా పోయిందని వెల్లడించారు. మెటబాలిక్ సర్జరీగా కూడా వ్యవహరించే ఈ శస్త్రచికిత్సను లాపరోస్కోపికల్గా చేస్తారని ఆయన తెలిపారు.
ఈ సర్జరీలో భాగంగా హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి వీలుగా కడుపు, పేగులను తిరిగి మారుస్తారని ఆస్పత్రి కన్సల్టెంట్ సీనియర్ రోబోటిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ పరీక్ తెలిపారు. హైబీపీ, ఊబకాయం తదితర వాటి కారణగా వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, శ్వాస ఆడకపోవడం, రక్తపోటు,, నిద్రలేమి, భారీ గురక సమస్యలకు ఆ రోగులు మందులు వాడేవారని తెలిపారు. వారి శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రాకపోవడంతో సర్జరీ చేయించుకున్నారని చెప్పారు. ఈ సర్జరీతో జీవితకాలం పెరగడంతో పాటు ఆ కాలంలో మెరుగైన జీవితం లభిస్తుందని పేర్కొన్నారు.