తెలంగాణ బాగు పట్ల ఆలోచన లేని పార్టీలు మనకు అవసరమా..

బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదు

కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదు 
రాష్ట్ర బీజేపీకి బీసీ అధ్యక్షుడిని తొలగించి ఓసీలకు ఇచ్చారు
గెలిచే ఆస్కారమే లేని ఇప్పుడు బీసీని సీఎం చేస్తామనడం గాలి మాటలే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క సాయం చేయలేదు
విభజన హామీలను విస్మరించిన బీజేపీ ప్రభుత్వ విస్మరించింది
ఎక్కడా లేని విధంగా బీసీ సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే ఏమీ చేయలేదని ప్రధాని చెప్పడం హాస్యాస్పందం
కాంగ్రెస్, బీఆర్ఎస్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా
నిజామాబాద్ అర్బన్ లో షబ్బీర్ పై తమ అభ్యర్థి గణేష్ గుప్తా గెలుపు తథ్యం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 
నవతెలంగాణ కంఠేశ్వర్: బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదని, కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదని, తెలంగాణ బాగు పట్ల ఆలోచన లేని ఆ రెండు పార్టీలు మనకు అవసరమా అన్నది ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.బీజేపీ చెప్పుకునే సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ నినాదంలో ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన లేదని, ఆ నినాదంలో తెలంగాణ ఉండి ఉంటే రాష్ట్రానికి ఐఐఎం, ఐఐటి, మెడికల్ కాలేజీలు వంటివి. ప్రత్యేకంగా వచ్చేవని తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి అదనపు సాయం ఒక్కటి చేయకపోవడమే కాకుండా అనేక పనుల్లో అడ్డంకి సృష్టించిందని విమర్శించారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా, అక్రమంగా ఆంధ్ర ప్రదేశ్ లో కలిపిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ పార్టీ ఎప్పుడూ ఓర్చుకోలేదని తెలిపారు. ప్రధాని మోదీ నుంచి ప్రతీ ఒక్క బీజేపి నాయకుడు తెలంగాణ గురించి అవహేళన చేస్తూ మాట్లాడారే తప్పా మనస్పూర్తిగా సహకారం అందించిన సందర్భం లేదని ఎండగట్టారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తు చేశారు. బీసీలకు అవి చేశామని, ఇవి చేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెబుతుండడంతో నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వ్యక్తిని మార్చి ఓసీ వ్యక్తిని అధ్యక్షుడిగా చేసి కొత్తగా బీసిని చేస్తామని ఆ పార్టీ చెబుతుండడం హాస్యాస్పదమని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, ఈ సారి ఆ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదు కాబట్టి గాలి మాటలకు బిసి నినాదం ఎత్తుకుంటున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేస్తే అందులోనూ ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన లేదని, తెలంగాణలో యాత్ర చేసినప్పుడు కూడా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడలేదని స్పష్టం చేశారు. అంటే బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లో తెలంగాణ ప్రస్తావన ఉండదని, కాంగ్రెస్ భారత్ జోడోలో తెలంగాణ ప్రస్తావన ఉండదని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల ఆలోచనలో కనీసం తెలంగాణ లేదని, అటువంటి పార్టీలు మనకు అవసరమా అన్నది ఆలోచించుకోవాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ ఇస్తామని ఇవ్వలేదని ప్రధాని ఆరోపిస్తున్నారని, కానీ ఈ సారి బీసీలకు కేటాయించిన బడ్జెట్ రూ. 6200 కోట్లు అని చెప్పారు. గత ఏడాదిన్నర కాలంలో బీసీ అడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి రూ. 1850కోట్లు, బీసీలకు ఫీజు రియింబర్స్ మెంట్ రూ. 1300 కోట్లు ఖర్చు చేశామని, ఇంత చేస్తున్న రాష్ట్రానికి వచ్చి ప్రధాన మంత్రి బీసీలకు రూ. వెయ్యి కోట్లు ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.షాదీ ముబారక్ తప్పా ముస్లిం మైనారిటీలకు బిఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో కేవలం 12 పాఠశాలు ఏర్పాటు చేసి కేవలం 6 వేల మంది ముస్లిం విద్యారులకు పదేళ్లలో 200 పాఠశాలలు పెట్టి లక్ష మంది మైనారిటీ విద్యార్థులకు విద్యను అందిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని వివరించారు. నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అంతే తేడా ఉంటదని. తమతో పోల్చుకోగలిగిన పనులను కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీని కాదని తమ పార్టీ అభ్యర్థి గణేష్ గుప్తా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Spread the love