తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయొద్దు

Don't arrest Teesta Setalvad– చార్జిషీట్‌ దాఖలు చేయనందున సుప్రీంకోర్టు నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు అరెస్టు నుండి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు బుధవారం గతంలో ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాన్షు ధులియా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంలో చాలా సమయం గడిచిందని, ఎలాంటి చార్జిషీట్‌ దాఖలు చేయలేదని వ్యాఖ్యానించింది. సంబంధిత విషయాలలో తీస్తా సెతల్వాద్‌కు కోర్టులు బెయిల్‌ మంజూరు చేసినందున, ఈ విషయంలో ఏమీ మనుగడ సాగించలేదని కూడా పేర్కొంది.
సెతల్వాద్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. గుజరాత్‌ ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్‌ హౌసింగ్‌ సొసైటీలో ”మ్యూజియం ఆఫ్‌ రెసిస్టెన్స్‌” నిర్మాణానికి సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారనే కేసుకు సంబంధించి సెతల్వాద్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఇక్కడ 2002 మతపరమైన అల్లర్లలో 60 మందికి పైగా మరణించారు.
ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేనప్పటికీ, 2015లో అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి రిఫర్‌ చేసింది. ఈ వ్యవహారం ఇంకా తేలకపోవడంతో తీస్తా సెతల్వాద్‌ అరెస్టుపై స్టే కొనసాగుతోంది. బుధవారం ఆదేశాల్లో స్టేను ధర్మాసనం పర్మినెంట్‌ చేసింది.
ఈ కేసులో తమ ముందస్తు బెయిల్‌ దరఖాస్తులను గుజరాత్‌ హైకోర్టు తిరస్కరించడంతో పౌర హక్కుల కార్యకర్త, ఆమె భర్త జావేద్‌ ఆనంద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Spread the love