వెండి ధర రూ.85వేలకు చేరొచ్చు

–  మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సీయల్‌ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే 12 మాసాల్లో వెండి ధర రూ.82వేల – 85వేలకు చేరొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే కిలో వెండి ధర 11 శాతం పెరిగింది. ప్రసుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.77వేల మేర పలుకుతోంది. ప్రస్తుతమున్న డిమాండ్‌ ఇలానే కొనసాగితే వచ్చే 12 నెలల్లో కిలో వెండి ధర రూ.82,000 నుంచి రూ.85,000 స్థాయికి చేరే అవకాశం ఉంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో 15 శాతం పెరుగుదల ఉండొచ్చు. ఒకవేళ తగ్గినా రూ.68,000 -70,500 వద్ద మద్దతు లభిస్తుందని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సీయల్‌ అంచనా వేసింది. అంతర్జాతీయంగా తగ్గుతోన్న ఆర్థిక మాంద్యం భయాలు, పారిశ్రామిక రంగంలో వెండికి డిమాండ్‌ పెరగడం, సౌర విద్యుత్‌, విద్యుత్‌ వాహనాల్లో వెండి వాడకం పెరగడం, పండగ సీజన్లు వెండి ధర పెరుగుదలకు ప్రధాన కారణాలు కానున్నాయని ఓస్వాల్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

Spread the love