– కేసులను ఛేదించిన పోలీసులను అభినందించిన రాచకొండ కమిషనర్
నవతెలంగాణ-హయత్ నగర్
చైన్ స్నాచర్లను వదిలిపెట్టం అని రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ హెచ్చరించారు. శుక్రవారం ఎల్బీనగర్లో ఉన్న సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులను ఛేదించిన పోలీసులను కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న జరిగిన బైక్ దొంగతనం కేసులో వెంటనే నిందితులను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, హౌమ్ గార్డ్ జగన్..అదేవిధంగా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 24న జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో తక్షణమే స్పందించి నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ పి. కృష్ణ, హౌమ్ గార్డ్ సంతోష్లను అభినందించి, నగదు రివార్డులను అందజేసినట్లు తెలిపారు.ఆయన వెంట ఎల్బీనగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ పురుషోత్తం రెడ్డి, యాచారం ఇన్స్పెక్టర్ లింగయ్య లు ఉన్నారు.