– సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్కు ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పౌరులమని, రాజ్యాంగం పౌరులైన మనకు అనేక హక్కులు కల్పించిందని అన్నారు. అయితే, ప్రతి ఒక్కరూ తనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన విధుల్లో ఒకటి ఓటు వేయడమన్నారు. గొప్ప మాతృభూమి పౌరులుగా బాధ్యతాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని అందరినీ అభ్యర్థిస్తున్నానన్నారు. ప్రతి ఐదేండ్లకు ఐదు నిమిషాలు కేటాయించి, గర్వంగా ఓటు వేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులకు పాత్ర ఉందని, అందుకే రాజ్యాంగంలో ‘భారత ప్రభుత్వం.. ప్రజలచే.. ప్రజల కొరకు’ అని రాసుందన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఆయన తొలిసారిగా ఓటరుగా ఓటు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిందన్నారు. న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో ఓటు వేయడంలో విఫలం కాలేదన్నారు.
క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు దేశం సిద్ధం
క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు దేశం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యాధారాల చట్టం (బీఎస్ఎ)పై అవగాహన కల్పించేందుకు న్యాయమంత్రిత్వ శాఖ సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాలు నేర న్యాయంపై భారతదేశం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కొత్త యుగంగా మార్చాయన్నారు. బాధితుల ప్రయోజనాలను కాపాడేందుకు, నేరాలపై విచారణ జరిపేందుకు ఈ మార్పు చేయడం చాలా ముఖ్యమని అన్నారు. కొత్త చట్టాలకు పార్లమెంట్ ఆమోదం తెలపడం.. దేశం మారుతున్నదని, పురోగమిస్తోందనడానికి సంకేతమని, ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త చట్టపరమైన చర్యలు అవసరమని సీజేఐ అన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలతో తీసుకువచ్చిన మార్పుల నుంచి దేశం పూర్తిగా ప్రయోజనం పొందేలా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఫోరెన్సిక్ నిపుణులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మన కోర్టు వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సదస్సులో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాల్గొన్నారు.