విమానంలో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. తాగుబోతు అరెస్ట్

నవతెలంగాణ – హైదరాబాద్: విమానాల్లో ప్రయాణికుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, జైపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం 6ఈ556లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదు సరికదా మరింతగా చెలరేగిపోయాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో విమానం ల్యాండయ్యాక నిందితుడిని పోలీసులు అప్పగించారు. ఇటీవల కొన్ని నెలల క్రితం ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఈ ఘటనను మర్చిపోకముందే అలాంటిదే మరోటి జరిగింది. గువాహటి-ఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో వీరంగమేశాడు. క్యాబిన్‌లో వాంతులు చేసుకోవడంతోపాటు మలవిసర్జన కూడా చేశాడు. ఈ వరుస ఘటనలతో విమానాల్లో మద్యం సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Spread the love