నవతెలంగాణ – బీజింగ్: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆదివారం ఆకస్మికంగా చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్లో పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులతో ఆయన సమావేశం కానున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. విద్యుత్తు వాహనాలకు చైనా రెండో అతిపెద్ద మార్కెట్గా కొనసాగుతోంది. దాదాపు వారం క్రితం మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. చైనాలో టెస్లా కార్లకు ఇటీవల గిరాకీ తగ్గింది. పోటీ సంస్థల నుంచి అందుబాటు ధరలో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఇటీవల టెస్లా తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. ఈ తరుణంలో మస్క్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు టెస్లా ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ’ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టడంపై కూడా ఆయన ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.