‘చైతన్య సేద్యం’ ఆదరించండి

'చైతన్య సేద్యం' ఆదరించండి– సర్క్యులేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన జూలకంటి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ, సకాలంలో సరైన సలహాలు, సూచనలు చేస్తున్న ‘చైతన్య సేద్యం రైతుల మాసపత్రిక’ను ఆదరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారంనాడిక్కడి జవహర్‌ నగర్‌ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ పత్రిక సర్క్యులేషన్‌ ప్రోగ్రామ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని ఆధునిక మార్పులను ఎప్పటికప్పుడు అందిస్తూ చైతన్య సేద్యం రైతులకు తోడుగా ఉంటుదన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి చైతన్య సేద్యం మాస పత్రికను వెలువరిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని అన్నారు. వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలంటే స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలనీ, ప్రభుత్వ విధానాల ఫలితమే రైతు ఆత్మహత్యలని తెలిపారు. రైతులు తమ సమస్యలపై సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చైతన్య సేద్యం ఎడిటర్‌ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, నాయకులు టి. కిషోర్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love