– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా
– హాజరైన రైతు సంఘం నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉపాధి హామీ పథకం వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి అని తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు ఆ సంఘం అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ వీబీ జీ రాం జీ పథకాన్ని రద్దు చేయాలనీ, అశ్వారావుపేట మండలంలో జనవరి నెల నుండి ఉపాధి పనులు జరుగుతున్నా,ఇప్పటివరకు ఉపాధి కూలీలకు ప్లే స్లిప్పులు కానీ, డబ్బులు కానీ రాలేదని,కావున వెంటనే ఉపాధి కూలీల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ చట్టాన్ని రద్దు చేయాలనీ,ఉపాధి హామీ కార్మికులకు యాప్ ఆధారిత రెండు సార్లు మస్టర్లు వేసే పద్దతి తీసేయాలనీ,సమ్మర్ అలవెన్సులు చెల్లించాలని,పని ప్రదేశంలో మంచినీళ్ళు, టెంటు, మెడికల్ కిట్, పనిముట్లు ఏర్పాటు చేయాలనీ, 200 రోజుల పనిదినాలు కల్పించాలి. రోజు కూలీ రూ. 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఉద్యోగి కుమారి కి అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు సోడెం ప్రసాదు, రైతు సంఘం నాయకులు మడకం నాగేశ్వరావు,మాడి నాగేశ్వరావు ,మడకం రాజబాబు,మడకం సత్యవతి,కాక వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.



