– అశ్వారావుపేట లో కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు తీర్మానం
– వ్యకాసం నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరగనున్న ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు సందర్భంగా 23 వ తేదీ గురువారం నిర్వహించే ప్రారంభ సభను విజయవంతం చేయాలని, అందుకోసం రైతులు, సంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
ఆయన సోమవారం అశ్వారావుపేట లోని ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల సమస్యలు పై నికరంగా నిలబడి పోరాడుతూ, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి కృషి చేస్తున్న అఖిల భారత కిసాన్ సభకి అనుబంధం గా తెలంగాణ రైతు సంఘం పనిచేస్తుంది అని,ఈ సంఘం రాష్ట్ర 3 వ మహాసభలు పురస్కరించుకొని 23 వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అధ్యక్షత న ఈ ప్రారంభ సభలో ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు అశోక ధావలే,విజూ క్రిష్ణన్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ మాజీ సభ్యులు తమ్మినేని వీరభద్రం లు హాజరు కానున్నారు అని తెలిపారు. ఈ మహాసభల్లో అశ్వారావుపేట నియోజకవర్గం సమగ్రాబివృధ్ధే లక్ష్యం గా తెలంగాణ రైతు సంఘం పలు తీర్మానాలను ప్రవేశపెడుతుంది అన్నారు.ఇందులో భాగంగా ఆయిల్ పామ్ బోర్డు, కొబ్బరి అభివృద్ధి మండలి ప్రాంతీయ కార్యాలయం, పామాయిల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, గిరిజన సంఘం జిల్లా నాయకులు సోడెం ప్రసాద్ లు పాల్గొన్నారు.



