నవతెలంగాణ-సత్తుపల్లి
స్థానిక మదర్ థెరెసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఇంజనీర్స్ డే’ (సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 166వ జయంతి)ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరెసా విద్యాసంస్థల ప్రెసిడెంట్ చలసాని సాంబశివరావు, విశ్వేశ్వరయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు. భారతదేశంలో నాగార్జున సాగర్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు రూపకల్పనలో విశ్వేశ్వరయ్య పాత్ర అద్భుతమైనదని ఆయన గుర్తుచేశారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారతరత్న’తో సత్కరించడమే కాకుండా, 100వ జన్మదిన సందర్భంగా ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసిందన్నారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని కళాశాల ‘అభిరుచి క్లబ్’ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్పో, పోస్టర్ ప్రజెంటేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ విభాగాల విద్యార్థులు ఆధునిక సాంకేతికతను, సృజనాత్మకతను జోడించి రూపొందించిన పలు ప్రాజెక్ట్ నమూనాలను, పోస్టర్లను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలను అధ్యాపకులు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు తిలకించి అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ మాట్లాడుతూ… విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
సమాచార సాంకేతికత ప్రపంచానికి వెన్నెముక లాంటిదని, ఐటీని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మానవాళి జీవితం మరింత సుఖమయమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎంవీ రామచంద్రరావు, సివిల్ హెచ్ఓడీ కే. రామకృష్ణారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎల్. సాయి ఇంద్రసేనారెడ్డి, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పంతంగి మురళీకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.



