– 31 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
– ఆగస్టు 4 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
– 8న సీట్ల కేటాయింపు
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఈసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 29 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు అవకాశముంటుందనీ, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. ఈనెల 31 నుంచి వచ్చేనెల రెండు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఈనెల 31 నుంచి వచ్చేనెల నాలుగు వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు. వచ్చేనెల నాలుగున వెబ్ఆప్షన్లను ఫ్రీజింగ్ చేస్తామని తెలిపారు. అదేనెల ఎనిమిదిన తొలివిడత సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఎనిమిది నుంచి 12 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాలనీ, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. వచ్చేనెల 20 నుంచి ఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అదేనెల 22న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందనీ, 23 వరకు వెబ్ఆప్షన్ల నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు. వచ్చేనెల 26న సీట్లు కేటాయిస్తామని వివరించారు. 29 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించడంతోపాటు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కోరారు. అదేనెల 26 నుంచి 30 వరకు సీట్లు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఈనెల 21 నుంచిhttps://tsecet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. వచ్చేనెల 28న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.