లక్నో : ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అన్స్కిల్డ్ కార్మికుడిగానైనా పనిచేసి రోజుకు రూ.300 లేదా రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాలని భర్తను ఆదేశించింది. విడిపోయిన భార్యకు నెలకు రూ.2,000 భరణంగా చెల్లించాలని కోరుతూ కుటుంబన్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఓ వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కొట్టివేస్తూ.. హైకోర్టు లక్నో బెంచ్లోని న్యాయమూర్తి రేణు అగర్వాల్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తీర్పు ఇచ్చినప్పటి నుంచి భార్యకు చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ జంట 2015లో వివాహం చేసుకుంది. అయితే వరకట్నం కోసం భర్త, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2016లో పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులకు ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ.. భార్యకు మనోవర్తి కింద నెలకు రూ.2వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇలా నెలవారీ భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అతడు ఫిబ్రవరి 21, 2023లో హైకోర్టును ఆశ్రయించాడు.
తన భార్య గ్రాడ్యుయేట్ అని, ఉపాధ్యాయురాలిగా నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందనే విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టులో పేర్కొన్నాడు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్స పొందుతున్నానని, తన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు తనపైనే ఆధారపడి ఉన్నారని చెప్పాడు. అయితే, భార్య ఉద్యోగం చేసి నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందనే విషయాన్ని రుజువు చేయలేకపోయాడు. దీంతో ఉద్యోగం లేకపోయినప్పటికీ కూలీగా రోజుకు కనీసం రూ.300 నుండి రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాల్సిందేనని ఆదేశించింది.