Sunday, September 20, 2026
E-PAPER
Homeఖమ్మంవానలు పడినా వర్షాభావం వీడలేదు

వానలు పడినా వర్షాభావం వీడలేదు

- Advertisement -

– జిల్లాలో 23 మండలాల్లో 17 చోట్ల లోటు.. 
– లోటు 261.6 మి.మీ. వర్షపాతం
నవతెలంగాణ – అశ్వారావుపేట 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు జిల్లాలో 28.5 శాతం వర్షపాతం లోటు నమోదైంది. జిల్లాకు సాధారణంగా ఈ కాలంలో 919.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 658 మి.మీ. మాత్రమే నమోదైంది. 

అంటే 261.6మి.మీ. లోటు ఉంది.
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడం కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఆదివారం నమోదైన వివరాల ప్రకారం జిల్లాలో ఒక్కరోజే 369.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల సగటు 16.1 మి.మీ.గా ఉంది. అయితే ఈ వర్షం ఇంతకాలంగా కొనసాగుతున్న వర్షాభావాన్ని పూర్తిగా భర్తీ చేసే స్థాయిలో లేదు.

భద్రాద్రి కొత్తగూడెం: నెలవారీ వర్షపాతం

2026లో నమోదైన వర్షపాతం, సాధారణ వర్షపాతంతో పోలిక (మి.మీ.).

నెల       నమోదైన వర్షపాతం      సాధారణ వర్షపాతం 

జూన్           161.7                           168.9

జూలై           213.3                            312.7

ఆగస్టు         160.9                            295.4

సెప్టెంబర్ 

20 వరకు       122                             142.7

ఒక్కరోజు వర్షం.. దీర్ఘకాలిక లోటుకు పరిష్కారం కాదు
సెప్టెంబర్‌ 20న నమోదైన వర్షపాతాన్ని మాత్రమే చూస్తే పరిస్థితి మెరుగుపడినట్లు కనిపిస్తున్నా, సీజన్‌ మొత్తం గణాంకాలు భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి.

జూన్‌: 161.7 మి.మీ. –  సాధారణం 168.9 మి.మీ. –  4.3% లోటు

జూలై: 213.3 మి.మీ. – సాధారణం 312.7 మి.మీ. –  31.8% లోటు

ఆగస్టు: 160.9 మి.మీ. – సాధారణం 295.4 మి.మీ. –  45.5% లోటు

సెప్టెంబర్‌ 20 వరకు: 122.0 మి.మీ. – సాధారణం 142.7 మి.మీ. –  14.5% లోటు

ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లోనే లోటు తీవ్రంగా పెరిగింది. ఆగస్టులో సాధారణ వర్షపాతంలో దాదాపు సగం మాత్రమే నమోదైంది. ఫలితంగా నేలలో తేమ, చెరువులు, బావులు, బోర్లపై ఒత్తిడి పెరిగే పరిస్థితి ఏర్పడింది. వర్షాభావం కారణంగా భూగర్భజలాలపై ఆధారపడే పంటలకు కూడా ఇబ్బందులు పెరుగుతున్నాయి.

17 మండలాల్లో లోటు: జిల్లాలోని 23 మండలాల్లో

17 మండలాలు –  వర్షపాతం లోటు

5 మండలాలు –  సాధారణ స్థాయి

1 మండలం –  స్కాంటీ/తీవ్ర లోటు

అధిక వర్షపాతం ఉన్న మండలం ఒక్కటీ లేదు

అత్యంత తీవ్రమైన లోటు :
దమ్మపేటలో 60.8%. ఇక్కడ సాధారణంగా 908.3 మి.మీ. రావాల్సి ఉండగా 356.2 మి.మీ. మాత్రమే నమోదైంది.

తదుపరి:

భద్రాచలం — 49.2% లోటు

అశ్వారావుపేట — 48.6% లోటు

మణుగూరు — 40.2% లోటు

బూర్గంపాడు — 39.1% లోటు

పినపాక — 37.8% లోటు

మరోవైపు చంద్రుగొండలో 840.2 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం కంటే 3.1% అధికంగా ఉంది. అయినప్పటికీ జిల్లా మొత్తాన్ని ఇది ప్రభావితం చేసేంత స్థాయిలో లేదు.

శనివారం వర్షం ఇచ్చిన ఊరట:
ఒక్కరోజు వర్షపాతంలో అశ్వాపురం 34.4 మి.మీ. తో ముందుంది. చర్ల, అశ్వారావుపేటలో 32.6 మి.మీ., దుమ్ముగూడెం లో 31.4 మి.మీ., బూర్గంపాడు లో 28.4 మి.మీ., ములకలపల్లిలో 27.4 మి.మీ., దమ్మపేటలో 26 మి.మీ. నమోదయ్యాయి. రోజువారీ వర్షపాత వర్గీకరణలో 10 మండలాల్లో మోస్తరు వర్షం, నాలుగు మండలాల్లో అధిక వర్షం, ఎనిమిది మండలాల్లో తేలికపాటి వర్షం నమోదైంది.ఒక్క మండలంలో వర్షం పడలేదు. అయితే భారీ లేదా అతిభారీ వర్షం ఏ మండలం లోనూ నమోదు కాలేదు. అందువల్ల శనివారం వర్షాన్ని వర్షాభావానికి ముగింపు కంటే పంటలకు తాత్కాలిక ఉపశమనంగా చూడాల్సి ఉంటుంది.

పంటలపై ప్రభావం:
దీర్ఘకాలిక ఉద్యాన పంటలకు నిరంతర నీటి అవసరం ఉండటంతో వర్షాల మధ్య విరామం పెరిగితే వాటిపై ఒత్తిడి ఎక్కువవుతుంది. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ వంటి దీర్ఘకాలిక పంటలకు, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడం, డ్రిప్‌ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను సమర్థంగా వినియోగించడం, తాత్కాలికంగా అనుకూలమైన అంతర పంటలు లేదా స్వల్పకాలిక పంటల వైపు రైతులను మార్గనిర్దేశం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. జిల్లా ఉద్యానశాఖ కూడా రైతులకు సాంకేతిక సలహాలు, డ్రిప్‌ ఇరిగేషన్‌, స్థిరమైన సాగు పద్ధతులపై సహకారం అందిస్తున్నట్లు జిల్లా అధికారిక సమాచారం పేర్కొంటోంది.

వాతావరణ పరంగా కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సెప్టెంబర్‌ 19 నాటికి దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటు తో పోలిస్తే లోటు లో ఉందని, ఎల్‌నినో పరిస్థితులు బలపడుతున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. 

విశ్లేషణాత్మకంగా చూస్తే…శనివారం కురిసిన వాన రైతుకు ఆశను ఇచ్చింది.. 
కానీ గణాంకాలు మాత్రం ఇంకా వర్షాభావాన్నే చెబుతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే దాదాపు 29 శాతం తక్కువ నీరు నేలలోకి చేరింది. ఒక్కరోజు 369.4 మి.మీ. వర్షం పడటం తక్షణ పంటలకు కొంత మేలు చేసినా, నెలల తరబడి ఏర్పడిన నేల తేమ లోటును, భూగర్భజలాల తగ్గుదలను, దీర్ఘకాలిక పంటల నీటి అవసరాన్ని ఒక్క వర్షంతో పూడ్చడం సాధ్యం కాదు.

కాబట్టి ప్రస్తుతం రైతులకు అవసరమయ్యేది వర్షం కోసం ఎదురుచూడటంతో పాటు నీటి వినియోగంలో కచ్చితమైన ప్రణాళిక, పంటల ఎంపికలో మార్పు, స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలు, అంతర పంటలు, నేలలో తేమను నిలుపుకునే పద్ధతులు. ప్రభుత్వం – వ్యవసాయశాఖ – ఉద్యాన శాఖలు మండలాల వారీగా లోటు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సలహాలు ఇవ్వడం కీలకం.ఖరీఫ్ పంటకాలం సెప్టెంబర్ తో ముగియనుండగా నైరుతి రుతుపవనాల ముగుస్తాయి. ఈ పరిస్థితుల్లో యాసంగి పంటల సాగు మొదలవుతుంది. ఇప్పటికే అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో వేరుశనగ సాగు మొదలయ్యిందని, అశ్వారావుపేట ఏడీఏ పెంటేల 

రవి కుమార్ తెలిపారు.మొక్కజొన్న సాగు కొరకు రైతులు దుక్కులు తయారు చేస్తున్నారు. వాణిజ్య పంట అయిన పొగాకు కొరకు నార్లు పోస్తున్నారు.ఆయిల్ పామ్ తోట కొరకు పేర్లు నమోదు చేసుకున్న రైతులు కొందరు మొక్కలు నాటారు. మిగతా రైతులు డ్రిప్ ఏర్పాటు చేస్తే మొక్కలు తీసుకోవచ్చని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

ప్రకృతి జల్లులతో వానాకాలం మళ్లీ పలకరించినా.. రైతులు అప్రమత్తంగా ఉండి సాగు అవుతున్న పంటల్లో తగు యాజమాన్య చర్యలు తీసుకుంటూ, యాసంగి పంటల సాగు చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -