నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. బులంద్షహర్లో గురువారం 48 డిగ్రీల సెల్సియస్తో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలోని పలు చోట్ల కరెంటు కోతలతో గందరగోళం నెలకొంది. గురువారం కరెంటు కోత కారణంగా విద్యుత్ శాఖపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నో, ఝాన్సీ, లఖింపూర్ సహా పలు జిల్లాల్లో ప్రజలు బీభత్సం సృష్టించారు. రాయ్బరేలీలో కరెంటు కోతతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. అయోధ్య, గోండాలో కూడా అలజడి చెలరేగింది. విద్యుత్ కోతకు గల కారణాలను వినియోగదారులకు తెలియజేయాలని పవర్ కార్పొరేషన్ చైర్మన్ ఆశిష్ గోయల్ అధికారులను ఆదేశించారు. గత రెండు రోజుల్లో యూపీలో వేడి 166 మంది ప్రాణాలను తీసింది. సెంట్రల్ యూపీలో వేడి, వేడిగాలుల కారణంగా 47 మంది చనిపోయారు. సెక్టార్ మేజిస్ట్రేట్, హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు రైల్వే కార్మికులు, హోంగార్డు, ఇంజనీర్తో సహా వారణాసి, పరిసర జిల్లాల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్రాజ్లో 11 మంది, కౌశాంబిలో తొమ్మిది మంది, ప్రతాప్గఢ్లో ఒకరు, గోరఖ్పూర్లో ఒక బాలికతో సహా ముగ్గురు మరణించారు. అంబేద్కర్ నగర్లో నలుగురు, శ్రావస్తి, గోండాలో ఒక్కొక్కరు వడదెబ్బకు మృతి చెందారు. ఝాన్సీలో వడదెబ్బ తగిలి ఆరుగురు చనిపోయారు. ఘజియాబాద్లో ఒక శిశువుతో సహా నలుగురు, ఆగ్రాలో ముగ్గురు, రాంపూర్, లఖింపూర్ ఖేరీ, పిలిభిత్, షాజహాన్పూర్లో ఒక్కొక్కరు మరణించారు. అయితే మరణాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. సహరాన్పూర్లోని శివాలిక్ కొండల్లో కూడా వేడి ప్రభావం చూపడం ప్రారంభించింది. ఘాజీపూర్లో ఎండ వేడిమి కారణంగా పవర్హౌస్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్కు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ చల్లబరుస్తున్నారు. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఆ ప్రాంతంలో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో రాష్ట్రంలో వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల్లో శీతలీకరణ ఏర్పాట్లు చేయాలని, వడదెబ్బకు సంబంధించిన అన్ని మందులను సరిపడా నిల్వ ఉంచుకోవాలని సూచనలు చేశారు.