నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ-జనసేన, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎన్టీఆర్కు నివాళులర్పించేందుకు వస్తున్న టీడీపీ-జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. గుడివాడ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో కొంతసేపటికి ఉద్రిక్తత సద్దుమణిగింది.