బావుపేట క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

– టాటా ఏస్ ట్రాలీనీ ఢీకొన్న కారు
– ఇద్దరు మృతి.. 7 మందికి గాయాలు… ఒకరి పరిస్థితి విషమం…
– క్షతగాత్రులను ఎంజీఎంకు తరలింపు
– వేములవాడకు వెళ్లి వస్తుండగా ఘటన
నవతెలంగాణ – హసన్ పర్తి
హసన్ పర్తి పోలీసు స్టేషన్ పరిధి ఏళ్ళాపూర్ శివారు బావుపేట క్రాసు రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు హసన్ పర్తి ఎస్సై కందాల అశోక్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 7 మందికి గాయాలు కాగా వారిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే … వరంగల్ కు చెందిన 9 మంది కుటుంబ సభ్యులు కలిసి టాటా ఏస్ ట్రాలీలో వేములవాడ వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో హసన్ పర్తి పోలీసు స్టేషన్ పరిధి ఎల్లాపూర్ శివారు బావుపేట క్రాసురొడ్డు వద్ద వీరు ప్రయాణిస్తున్న ట్రాలీని కరీంనగర్ నుండి వస్తున్న సూరారంకు చెందిన కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో టాటా ఏస్ ట్రాలీలో ప్రయాణిస్తున్న వరంగల్ ఉర్సు గుట్టకు చెందిన ఆమాంచ శ్యామ్ సుందర్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య కోమాలోకి వెల్లినట్లు ఎంజీఎం వైద్యులు తెలిపారు. అంతేకాకుండా కారు డ్రైవర్ రవి ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందగా టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న అమాంచ దేవి, అమాంచ లలిత, అమాంచ సంతోష్, అమాంచ లక్ష్మణ్, అమాంచ నాగేంద్ర, అమాంచ అలేఖ్యలకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తామని ఎస్సై ఎండీ.వలీ తెలిపారు.

Spread the love