రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయండి

రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయండి– మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని (నారీ శక్తి వందన్‌ చట్టం-2023) తక్షణమే అమలు చేయాలనీ, తద్వారా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లు రిజర్వు అయ్యేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్డు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. సమగ్ర సమాధానాన్ని దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుపు సీనియర్‌ న్యాయవాది కను అగర్వాల్‌ కోరడంతో, ధర్మాసనం కేంద్రానికి సమయమిచ్చింది. పిటిషనర్‌ జయ ఠాకూర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ సార్వత్రిక ఎన్నికలకు ముందు చట్టాన్ని అమలు చేసేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ దశలో ఆదేశాలు ఇవ్వలేమనీ, కేంద్రం సమాధానం కోసం వేచి చూడాలని జస్టిస్‌ ఖన్నా అన్నారు. అనంతరం విచారణను మూడువారాలకు వాయిదా వేశారు. 2023 సెప్టెంబర్‌ 21న లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. లోక్‌సభ దాదాపు ఏకాభిప్రాయంతో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించగా, రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Spread the love